మంత్రులకు శాఖల కేటాయింపులో భాగంగా కింజరాపు అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ అప్పగించారు. దీనిపై అచ్చెన్నాయుడు స్పందించారు.

"నాపై నమ్మకంతో అత్యంత కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రిగా నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారికి కృతజ్ఞతలు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు నాకు అప్పగించిన బాధ్యతను అంతఃకరణ శుద్ధితో నిర్వహించి ప్రతిక్షణం రైతన్నల సంక్షేమానికి, రాష్ట్ర వ్యవసాయాభివృద్దికి పాటుపడతా. 

గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ శాఖను భ్రష్టు పట్టించింది. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో వ్యవసాయాభివృద్దికి పాటుపడతాం. విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతన్నలకు అన్ని విధాలా అండగా నిలబడతాం. రైతుల ఆదాయం పెంపొందించేందుకు కృషి చేస్తాం. 

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అందించిన సబ్సిడీ యంత్రాలు, యంత్ర పరికరాలు, మైక్రో ఇరిగేషన్ వంటి అన్ని పథకాలు పునరుద్ధరిస్తాం. రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు నా వంతు కృషి చేస్తా" అంటూ అచ్చెన్నాయుడు వివరించారు. 

అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖతో పాటు మార్కెటింగ్, పశుసంవర్థక శాఖలు కూడా అప్పగించిన సంగతి తెలిసిందే.